కొత్త బళ్ళు మరికొంత ఆలస్యం
26/04/2013
TAGS:
కర్నూలు, ఏప్రిల్ 25: రైల్వేశాఖ ప్రకటించిన కొత్త రైళ్లు పట్టాలెక్కడం మరింత ఆలస్యం కానుంది. రైల్వేలో బోగీల కొరత కారణంగా కొత్త రైళ్లు పరుగులు తీయడంలో ఆలస్యం జరుగుతుందని రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరిలో రైల్వేశాఖ మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి 12 కొత్త రైళ్లతో పాటు పలు రైళ్ల గమ్య స్థానాలను పెంచారు. మరికొన్ని రైళ్లను ఆయా ప్రాంతాల మధ్యలో వారంలో తిరిగే రోజులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీటిలో గమ్యస్థానాలు పెంచిన రైళ్లు మాత్రం కొత్త గమ్యస్థానాలకు...
more... పరుగులు తీస్తాయని, అలాగే వారంలో ఒకటి, రెండు రోజులు అదనంగా తిప్పుతామని ప్రకటించిన రైళ్లకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అయితే కొత్తగా ప్రకటించిన రైళ్లు పట్టాలెక్కడానికి మరో మూడు, నాలుగు నెలల సమయం పడుతుందని రైల్వే అధికారులు అంటున్నారు. కొత్తగా ప్రకటించిన రైళ్లలో మంగుళూరు-కాచిగూడ, కర్నూలు-సికింద్రాబాద్ మధ్య ఎక్స్ప్రెస్, కర్నూలు-నంద్యాల ప్యాసింజర్ రైళ్లతో పాటు మరికొన్ని కొత్త రైళ్లు ఉన్నాయి. అయితే ఈ రైళ్లను ప్రవేశపెట్టడానికి రైలు బోగీల కొరత తీవ్రంగా ఉందని తెలుస్తోంది. బోగీల లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో కొత్త రైళ్లు పట్టాలెక్కనున్నాయని అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న రైల్వే బోగీల కర్మాగారాల్లో ఉత్పత్తి అవుతున్న బోగీల సంఖ్య, ప్రాధాన్యతా క్రమాన్ని బేరీజు వేసి పరిశీలిస్తే రాష్ట్రంలో కొత్తగా ప్రకటించిన రైళ్లు పరుగులు తీయడానికి ఇంకా 3 నెలల కాలం అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు.